Sunday, December 21, 2008

విశ్వరూపానికి బుడగల సిద్ధాంతం

డిసెంబరు 2008



ఈ విశ్వాన్ని సృష్టించినది ఎవ్వరు?

సృష్టి కర్త!

ఆ సృష్టి కర్తని సృష్టించినది ఎవ్వరు?

చొప్పదంటు ప్రశ్నలు వెయ్యొద్దు.

పోనీ ఈ సృష్టి కార్యం ఎప్పుడు మొదలైంది?

బైబిలు ప్రకారం ఓ ఐదు వేల ఏళ్ళ కిందట.

హిందూ పురాణాల ప్రకారం, ఈ సృష్టి కార్యం ఎప్పుడు మొదలైందో ఎవ్వరికీ తెలియదు. సృష్టి, స్థితి, లయ అనే మూడు ప్రక్రియలూ అలా నిరంతరం జరుగుతూనే ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.

పోనీ భౌతిక శాస్త్రవేత్తలని అడిగి చూస్తే….

“ఎప్పుడో పదిహేను బిలియను (పదిహేను వందల కోట్ల) సంవత్సరాల క్రిందట ఒక సుముహూర్తాన్న ఒక మహా పేలుడు సంభవించిందనిన్నీ, ఆ పేలుడు ఫలితమే ఈ విశ్వం అనిన్నీ, ఆ పేలుడు ముక్కలు ఇంకా అన్ని దిశలలోకీ చెల్లా చెదరు అవుతూనే ఉన్నాయనిన్నీ….” అంటూ ఒక చేట భారతం మొదలు పెడతారు.

భౌతిక శాస్త్రం క్షుణ్ణంగా చదువుకున్న నాకే అర్ధం అయి చావటం లేదు – వాళ్ళు చెప్పేది. వింటూన్న కొద్దీ మతి పోతోంది. ఇహ సామాన్యుల సంగతి ఏమి చెప్పగలం?

“అయ్యా! ఏమిటో పేలింది, దాని ఫలితంగా ఈ విశ్వం నిరంతరం అలా వ్యాప్తి చెందుతోంది” అని అంటున్నారుకదా, “ఏమిటి పేలిందో కాస్త చెప్పండి.” అని అడగండి. చెప్పరు!

ఇలా పేలినది మన భూగ్రహమంత కైవారంతో ఉన్న ఒక పేద్ద చలివిడి ముద్దలా ఉండేదని అందాకా ఉహించుకుందాం.

ఈ చలివిడి ముద్ద భూగ్రహంలా, బొంగరంలా ఆత్మ ప్రదక్షిణం చేసుకుంటూ ఉండేదా? ఏమో! తెలియదు.

ఎక్కడుండేదిట?

ఎక్కడ అనే ప్రశ్నే లేదు ట. ఆ చలివిడి ముద్దే అప్పటి విశ్వం అంతా. అదెక్కడ ఉంటే అదే విశ్వం ట.

పోనీ, ఈ చలివిడి ముద్దని ఎవ్వరు చేసేరు? ఎక్కడనుండి వచ్చింది? ఏమో! అది చెప్పరు.

“ఏమిటి పేలిందో నిర్దుష్టంగా చెప్పరు కాని ‘అది’ పేలిన తర్వాత ఏమి జరిగిందో చెప్పగలమంటారు.

కానీ, ఆ పేలుడు ‘ముందు’ సంగతి వాళ్ళని అడక్కండి. చెప్పలేరు.

ఏమైనా అంటే, “ఆ పేలుడుతోటే కాలం పుట్టింది కనుక ఆ పేలుడు కి ‘ముందు’ అనే ప్రసక్తే లేదంటారు.

పిల్ల పుట్టిన తర్వాతే కదా జాతకం రాస్తాం. పుట్టుకకి పూర్వం ఏమిటి జరిగిందో జాతక శాస్త్రం చెప్పదు. అలాగే ఈ విశ్వం పుట్టిన తర్వాత విషయాలని ఆధునిక భౌతిక శాస్త్రం అవగాహన చేసుకోగలుగుతోంది కానీ, అంతకు ముందు సంగతి అడిగితే నానా తంటాలు పడుతూ గుటకలు వేస్తోంది తప్ప సరి అయిన సమాధానం చెప్పలేక పోతోంది.

ఈ రకం ప్రశ్నలకి సమాధానాలు వెతకటమే ఆధునిక విశ్వశాస్త్రం యొక్క ధ్యేయం.

గత రెండు దశాబ్దాలలో జరిగిన పరిశోధనల వల్ల తెలిసినది ఏమిటంటే – ఈ విశ్వం యొక్క ‘అంతు పట్టటం’ మనకి తెలియటం లేదని. సిద్ధాంతాలు కుక్కగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి తప్ప ప్రామాణికమైన రుజువులు దొరకటం లేదు.

ఈ సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతాన్ని, కొంచెం హిందూ పురాణాలలో కనిపించే సాంకేతిక పదజాలం ఉపయోగించి చెబుతాను. ఈ కథనంలో ప్రచారంలో ఉన్న సిద్ధాంతం కొంత, నా పైత్యం కొంత ఉన్నాయి.

స్థల కాల పరిమితులు లేని మాహా సాగరం ఒకటి ఉందనుకొండి. దాన్ని మోక్ష సాగరం అందాం. ఈ మహా సాగరంలో అనేకమైన నీటి బుడగలు అలా పుడుతూనే ఉన్నట్లు ఊహించుకొండి. సబ్బునీటి బుడగలలా ఈ బుడగలు వ్యాప్తి చెంది, పెద్దవై, ఒక నాడు టప్ మని పేలిపోతాయని ఊహించుకొండి. ఇలా పెరిగి పెద్దవవుతూన్న బుడగల వంటి బుడగలలో మనం నివశించే విశ్వం ఒకటన్న మాట. ఆ మహా సముద్రంలో ఇటువంటి బుడగలు ఎన్నున్నాయో ఎవరని లెక్క పెట్టగలరు? ఇదే విధంగా సృష్టిలో లెక్కకి అందని విశ్వాలు ఉన్నాయి. వాటిల్లో మన విశ్వం ఒకటి. ఇది సబ్బు బుడగలా ఇంతింతై, వటుడింతై అన్న చందాన్న వ్యాప్తి చెందుతోంది. ఇదే విధంగా అనంతమైన విశ్వాలు – మనతోపాటు – సమాంతరంగా పుడుతున్నాయి, వ్యాప్తి చెందుతున్నాయి, నీటి బుడగలలా పేలి లయమై పోతున్నాయి. ఈ సిద్ధాంతమే సరి అయినది అయితే ఈ బుడగల జీవిత ప్రమాణం బుద్బుద ప్రాయం కదా! ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు టప్ మని పేలి పోతాయి. బుడగ పేలితే ఏమి మిగులుతుంది? నాలుగైదు నీటి తుంపరలు మిగులుతాయి. అవి ఆ మోక్ష మహా సముద్రంలో కలిసిపోతాయి.

ఈ ఉపమానంలో సబ్బు బుడగ వ్యాప్తి చెందినట్లే మన విశ్వం కూడా వ్యాప్తి చెందుతోంది. బుడగ అంటే ఉపరితలం ఉన్న ఒక గోళాకారం కదా. ఈ గోళం యొక్క ఉపరితలం మనం ఉంటూన్న విశ్వం. ఈ ఉపరితలం మీదే ఈ విశ్వంలోని గేలక్సీలు ఉన్నాయి. బుడగ కైవారం పెరుగుతూన్న కొద్దీ ఈ గేలక్సీల మధ్యనున్న దూరం పెరుగుతూ పోతుంది. ‘ఇలా ఎన్నాళ్ళు పెరుగుతుంది?’ అన్నది ఇంతవరకు సమాధానం లేని ప్రశ్నగా మిగిలి పోయింది. ఇలా కొన్నాళ్ళు పెరిగిన తర్వాత ఈ విశ్వం మళ్ళా కుచించుకుపోయి మళ్ళా మరొక చలివిడి ముద్దలా తయారవుతుందని ప్రస్తుతం చెలామణీలో ఉన్న ఉప సిద్ధాంతాలలో ఒకటి. కాని, నా సిద్ధాంతం ప్రకారం, ఈ వ్యాప్తి కొన్నాళ్ళు జరిగిన తర్వాత సబ్బు బుడగ పేలినట్లు మన విశ్వం టప్ మని పేలిపోతుంది. అప్పుడు ఈ విశ్వంలో ఉన్న పదార్ధం అంతా – సబ్బు బుడగలోని నీటి తుంపరలలా - మోక్ష మహాసాగరంలో పడిపోతుంది. (కావలిస్తే ఈ సంఘటనని "మహాప్రళయం" అని అభివర్ణించండి!) ఈ పదార్ధమే మరో నీటి బుడగ పుట్టటానికి కావలసిన ముడి పదార్ధం అన్న మాట.

శాస్త్రంలో మనం సిద్ధాంత సౌధాలని ఎన్నిటినైనా నిర్మించవచ్చు. అంతవరకు మనకి అవగాహన అయిన జ్ఞానసంపదని విస్మరించకుండా, ఇంతవరకూ అర్ధం కాని ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలిగితే ఆ సిద్ధాంతం విజయవంతం అవుతుంది.

దూరదర్శనుల సహాయంతో ఎడ్విన్ హబుల్ చేసిన ప్రయోగాల వల్ల ఈ విశ్వం వ్యాప్తి చెందుతోందని మనకి తెలుసు. ఇది సర్వులూ అంగీకరించేరు. మన మోక్ష సముద్రంలో బుడగలు కూడా వ్యాప్తి చెందుతున్నాయి కదా. ప్రస్తుతం చెలామణీలో ఉన్న బ్రహ్మాండ విచ్ఛిన్న వాదానికీ నేను కొత్తగా చెబుతూన్న బుడగల వాదానికి కొన్ని సారూప్యాలూ, కొన్ని తేడాలు ఉన్నాయి. ఉదాహరణకి నేను చెప్పే సిద్ధాంతంలో మన చలివిడి ముద్ద పేలదు (doesn't explode); కాని, అదే చలివిడి ముద్ద వ్యాప్తి చెంది, చెంది, పేద్ద బుడగలా అయిపోయి, అప్పుడు టప్ మని పేలిపోతుంది (pops). (ఇక్కడ తెలుగులో explosion కీ popping కీ "పేలుడు" అన్న మాటే వాడటం వల్ల అర్ధానికి కొంచెం ఇబ్బంది కలగొచ్చు.)

ఇప్పుడు నేను వివరిస్తూన్న సిద్ధాంతంలో మన చలివిడి ఎక్కడ నుండి వచ్చిందో చెప్పవలసిన పని లేదు; మన బుడగలు సముద్రంలోంచి పుడుతున్నాయి. బుడగ వ్యాప్తి చెంది, చెంది చివరికి ఏమౌతుందో చెప్పటం కూడ సుళువే. సబ్బు బుడగలు పేలి నట్లే ఈ విశ్వం కూడ ఎప్పుడొ ఒక నాడు పేలి పోతుంది కదా. అప్పుడు ఈ విశ్వంలో ఉన్న పదార్ధం అంతా మోక్ష సముద్రంలో కలిసి పోతుంది. జీవి తనువు చాలించిన తర్వాత దాని ఆత్మ పరమాత్మలో కలిసిపోయినట్లూ, భౌతిక కాయం మట్టిలో కలిసిపోయినట్లూ ఊహించుకొండి. బ్రహ్మాండ విచ్ఛిన్న వాదంలో పేలుడుకి ముందు సంగతి మనం అడగకూడదు; అది సమాధానం లేని ప్రశ్న. మన కొత్త వాదంలో విశ్వం పుట్టినప్పుడు పేలుడు ఏమీ లేదు, విచ్ఛిన్నమైనదీ ఏదీ లేదు. పేలుడు ముందు మోక్ష మహా సాగరం ఉంది. కనుక పేలుడుతో కాలం కూడా పుట్టిందన్న వాదం వీగి పోతుంది. కాల గమనం నిరంతరం అలా సాగిపోతూనే ఉంటుంది. అది ఆదిమధ్యాంతరహితం. మోక్ష సాగరమూ ఆదిమధ్యాంతరహితమే! ఈ మహా సాగరమే విష్ణువు. ప్రతీ దివ్యశక్తికీ మానవ రూపం ఆపాదించటం మన సంప్రదాయం కనుక ఈ మహాసముద్రానికి రూపాన్నిస్తూ మనవాళ్ళు విష్ణువుకి మూర్తిత్వం ఇచ్చి పాల సముద్రంలో మానవాకృతిలో పడుక్కోబెట్టేరు. ఇలా వర్ణనకి లొంగని భావాలకి రూపకల్పన చేసే సంప్రదాయాన్ని ఇంగ్లీషులో iconography అంటారు.

పురాణంలోని కథలకీ సైన్సు లోని సిద్ధాంతాలకీ తేడా ఏమిటంటే, సైన్సు లో ప్రతీ సిద్ధాంతాన్నీ ప్రాయోగాత్మకంగా నిరూపించాలి. “నాకు దేవుడు కనిపించేడు కనుక దేవుడున్నాడని నేను ఢంకా భజాయించి చెబుతున్నాను” అన్నంత మాత్రాన సైన్సు ఒప్పుకోదు. దేవుడు కనిపించటానికి మనం చేసిన ప్రయత్నం వర్ణించి చెప్పమని అడుగుతుంది. అదే ప్రయత్నం పలువురు చేస్తే వాళ్ళకీ దేవుడు కనిపిస్తే అప్పుడు మీకు దేవుడు కనిపించేడన్న మాటని నమ్ముతుంది. దేవుడే కనిపించక్కరలేదు. దయ్యం కనిపించిందని చెప్పినా అదే రకం రుజువు కావాలి. కనుక నేను పైన ఉటంకించిన సిద్ధాంతం నిజమో కాదో తెలియాలంటే ఒక సిద్ధాంతసౌధాన్ని లేవదియ్యాలి. ఈ సిద్ధాంతానికి గణితం ఇటికలు. ఇంతవరకు ఈ భౌతిక ప్రపంచం గురించి మనకి అవగాహనలో ఉన్న విజ్ఞానం సున్నం. అంటే మనం కట్టే సౌధాలు గాలిలో మేడలులా ఉండకూడదు.

వచ్చిన చిక్కేమిటంటే ఈ రకం గణితం చాలా సంక్లిష్టమైనది. ఈ గణితం సహాయం లేకుండా చెబితే ఏ సైన్సు ఫిక్షన్ కథలాగో, పురాణాల్లో కథలాగో ఉంటుంది.

నేను 1952-54 లో బందరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియేట్ చదువుతూన్న రోజుల్లో మా తెలుగు పుస్తకంలో ఒక పాఠ్యాంశం ఉండేది. దాని పేరు "వాత్సాయన వంశ వర్ణనం". పూర్తిగా జ్ఞాపకం రావటం లేదు కాని (తిరుపతి వేంకటకవులు రాసిన?) "హరివంశం" అనే పుస్తకం లోంచి తీసిన మచ్చు తునక అని నా అనుమానం. ఈ పాఠ్యాంశంలో ఒకొక్క వాక్యం పొడుగు ఒక పేజీకి మించే ఉండేది. కొరుకుడు పడకుండా, మింగుడు పడకుండా ఉండే ఈ వచనం వాత్సాయనుల వంశాన్ని వర్ణిస్తుంది. మనం పూజ చేసేటప్పుడు ‘ద్వితీయ పరార్ధే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రధమ పాదే,….’ అనీ ‘జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే …:’ అని ఈ విశాల విశ్వం యొక్క స్థల కాల సమవాయం (space-time continuum)లో మన ఉనికిని చెప్పుకుంటాం కదా. ఈ వాత్సాయనులు రాజవంశం వారు కనుక వారి ప్రవరని చెప్పటానికి రచయిత సృష్ట్యాది నుండీ మొదలుపెట్టి, సృష్టిలో ఈ విశ్వరూపాన్ని వర్ణించుకుంటూ వచ్చి నెమ్మదిగా భారత దేశంలో వీరి రాజ్యం దగ్గరకి వచ్చి, వీరి తాత ముత్తాతతలని చెప్పుకు వస్తాడు. టూకీగా ఆ కథనం (నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు) చెబుతాను, సావధానంగా వినండి.

“ఈ సృష్టి మన ఊహకి అందనంత విశాలమైనది, పురాతనమైనదీను. సముద్రంలో నీటి బుడగలులా మన ఊహకి అందనన్ని విశ్వాలు ఉన్నాయి. సముద్రంలో నీటి బుడగలు ఉద్భవించినట్లే ఈ విశ్వాలు పుడుతూ ఉంటాయి. బుడగ పేలిపోయి అదృశ్యమైపోయినట్లే అదృశ్యమైపోతూ ఉంటాయి. బుద్బుద ప్రాయమైన విశ్వాలు ఆ మహాసాగరంలో అలా పుడుతూనే ఉంటాయి. వాటి కాలం మూడగానే అలా బుడగ పేలినట్లు పేలి పోయి మళ్ళా ఆ సముద్రంలో కలిసిపోతూనే ఉంటాయి. అలాంటి బుడగలలో ఒకటి మనం ఉంటూన్న, మన ఇంద్రియాలకి గోచరమవుతూన్న చరాచర జగత్తు. ఈ జగత్తులో ఉన్న అసంఖ్యాకమైన నభోగోళాలలో ఒకటి మనం నివసించే భూమి. ఈ భూమి మీద, జంబూద్వీపంలో, భరతవర్షంలో, భరతఖండంలో, ఒక రాజ్యంలో…” అర్ధ శతాబ్దం క్రితం చదువుకున్న పాఠ్య భాగం దరిదాపుగా ఇలా కొనసాగుతుంది. మళ్ళా ఆ పుస్తకం దొరక లేదు కనుక అంతా తు. చ. తప్పకుండా ఇలాగే ఉందని చెప్పలేను.

గత పది, పదిహేను ఏళ్ళల్లో ఆధునిక విశ్వశాస్త్రం లో జరుగుతూన్న పరిశోధనలు, వాదోపవాదాలూ చదువుతూ ఉంటే నాకు ఈ కథ పదే పదే జ్ఞాపకం వస్తోంది.

ఏవిఁటో ఏదీ సరిగ్గా అర్ధం అయి చావటం లేదు.

ఎంత ఆలోచించినా, ఎన్ని పుస్తకాలు చదివినా అనుమానాలు నివృత్తి కావటం లేదు.

ఒకళ్ళేమో ఇదంతా మిధ్య అంటారు. వాళ్ళే, అదే నోటితో, ఇదంతా దేవుడి సృష్టి అంటారు.

మిధ్యని సృష్టించటవేఁవిటి? నా బొంద!

అహఁ! మనం కనే కలలు నిజమా? మిధ్యా?

కల నిజం ఎలా అవుతుంది? మిధ్య అయిన ఈ కలని సృష్టించినది ఎవ్వరు?

మన మెదడు సృష్టిస్తోంది కదా!

5 comments:

  1. బాగుంది. చాలా పెద్ద ప్రశ్నలే రేకెత్తించారు.

    ReplyDelete
  2. Yes, Big Bang Theory లో చాలా ప్రశ్నలు ఉన్నాయి అలాగే చాలా జవాబులు కూడా ఉన్నాయి. Time make clear everything. Nice post, Thank you.

    మరమరాలు

    ReplyDelete
  3. గురువర్యా!

    ఇన్నాళ్లకు తెలుగు బ్లాగు మరో అసలు సిసలైన మేధావిని మా ముందుకు తెచ్చింది. రోహీణీ ప్రసాదు గారు ఈ మధ్య రాయడం తగ్గించారెందుకనో? ఏదేమైనా మీరు బ్లాగు రాయడం మాత్రం మానకండి. మీ మస్తిష్కంలో తిరగాడే ఆలోచనామృతాన్ని మాకూ ధారపోయండి. ఇన్ని వేల సంవత్సరాలుగా తెగని ప్రశ్నలకు జవాబు తెలియడం కష్టసాధ్యమే అయినా అసలు ప్రశ్నించడం మానుకోకూడదు కదా! ఈ విషయమై మన తథాగతుడు ఏమన్నాడో మీకేమైనా తెలుసా? ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉంది.వీలైతే రాయగలరు. - భవదీయుడు.

    ReplyDelete
  4. Could you please write on Time and Space.

    ReplyDelete